టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్,కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి దారిసిందనే విషయం తెలిసిందే.ఇక శివప్రసాదరావు బలవన్మరణం కేసులో పోలీసుల విచారణ ముమ్మురంగా కొనసాగుతోంది.ఇక ఆయన అంత్యక్రియలు పూర్తికాక ముందే ఈ అంశంపై టీడీపీ,వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఆ నిప్పు ఇప్పటికి మండుతూనే వుంది.అయితే కోడెల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దృష్టి సారించారు.ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై వారు ఆరా తీస్తున్నట్టు సమాచారం.ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు కోడెల 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది.చివరి నిమిషంలో ఎవరితో మాట్లాడారు,వారితో ఆయన ఏం మాట్లాడారనే అంశంపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు,కోడెల ఫోన్కు సంబంధించిన ఇన్ కమింగ్,అవుట్ గోయింగ్ కాల్స్ అంశంపై లోతుగా దర్యాప్తు చేయగా తెలిసిన నిజమేంటంటే కోడెల చివరిగా కేన్సర్ ఆస్పత్రి వైద్యురాలికి ఫోన్ చేసినట్లు కాల్డేటా ఆధారంగా తెలిసిందట.వీటితో పాటుగా ఇతర కాల్స్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.కోడెల భార్య,కూతురు,గన్మన్,డ్రైవర్తోపాటు..మరో నలుగురిని ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు,బంధువులతో సహా 12 మందిని విచారించి వారి వాంగ్మూలం రికార్డు చేశారు.మరికొంతమంది కోడెల అంత్యక్రియల నిమిత్తం నరసరావుపేటకు వెళ్లారని. తిరిగొచ్చిన తర్వాత వారిని కూడా విచారిస్తామని బంజారాహిల్స్ ఏసీపీ అన్నారు.కోడెల ఆత్మహత్యతో ఆయన కుమారుడు శివరామకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.కాగా కోడెల శివప్రసాదరావు మృతి అనుమానాస్పదమని,రాజకీయ కక్ష అని కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని నిశ్చయించుకున్నారట.ఏది ఏమైన కోడెల మరణం ఇంకా ఎన్నిమలుపులు తిరిగి చివరకు ఎక్కడ ముగుస్తుందోనని రాజకీయాలపై ఆసక్తి వున్న వారు ఆలోచిస్తున్నారట…