కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. గురువారం చంద్రబాబు నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు డుమ్మా కొట్టారు.
కాకినాడ, రాజమహేంద్రవరం లోక్ సభ స్థానాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, మాగంటి రూపలు సైతం గైర్హాజరుకావడం చర్చ నీయాంశంగా మారింది. మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇకపోతే మాజీ ఎమ్మెల్యే, రామచంద్రపురం ఇంచార్జ్ తోట త్రిమూర్తులు సైతం చంద్రబాబు సమీక్ష సమావేశానికి ముఖం చాటేశారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై గుర్రుగా ఉన్న తోట త్రిమూర్తులు నియోజకవర్గంలో ఉండి కూడా చంద్రబాబు సమావేశానికి గైర్హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీని వీడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చలమలశెట్టి సునీల్ సైతం పార్టీ మారాలనే ఆలోచనలో పడ్డారని టాక్. ఇప్పటికే చలమలశెట్టి సునీల్ మూడు పార్టీలు మారారు. మూడు పార్టీలు మారినప్పటికీ కాకినాడ ఎంపీగా మాత్రం గెలుపొందలేకపోయారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కాకినాడకు చెందిన కీలక నేతలు సైతం డుమ్మా కొట్టారు. కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్, తొమ్మిది మంది కార్పొరేటర్లు చంద్రబాబు మీటింగ్ కు గైర్హాజరయ్యారు.
కాకినాడ సిటీ నాయకులు అంతా గత ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీటును వనమాడి కొండబాబుకు కేటాయించవద్దని చంద్రబాబు నాయుడును కోరారు. అయితే చంద్రబాబు తమ మాట పట్టించుకోకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.