చంద్రుడిపై మొదలైన రాత్రి సమయం.. విక్రమ్‌పై ఆశలు ముగిసినట్టే!

0
1376

ఇప్పటి వరకు చంద్రుడిపై పరిశోధనలకు ఏ దేశం చేయని సాహసం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2ను ప్రయోగించింది. అయితే ఈ ప్రయోగం చివరి మెట్టుపై నిలిచిపోయింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి అంకంలో నిలిచిపోయింది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ సెప్టెంబరు 7 తెల్లవారుజామున చంద్రుడిపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రంతో సంకేతాలు ఆగిపోయాయి. నిర్దేశిత ప్రదేశానికి సమీపంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తిరిగి దానితో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో శతవిధాల ప్రయత్నించింది. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసుకుని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌ల కథ ముగిసినట్టే. అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపడానికి ఇస్రో ప్రయత్నించింది. ఆ ప్రదేశంపై 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయం ముగిసింది.

రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలు కావడంతో నేటి నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ఈ ఉష్ణోగ్రతను ల్యాండర్‌, అందులోని రోవర్‌ తట్టుకోలేవు. చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ బలంగా ఢీకొట్టడంతో‘హార్డ్‌ ల్యాండింగ్‌’ జరిగినట్లు ఆర్బిటర్‌లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో స్పష్టం చేసింది. ల్యాండర్ ఆచూకీ గుర్తించేందుకు సెప్టెంబరు 17న నాసా లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో) ప్రయత్నించినప్పటికీ దాని జాడ తెలియరాలేదు. ల్యాండర్‌ నుంచి భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోవడానికి గల కారణాలపై విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన ఒక జాతీయ స్థాయి కమిటీని నియమించారు. కారణాలను విశ్లేషించి ఈ కమిటీ రూపొందించిన నివేదికను త్వరలోనే వెలువరిస్తామని ఇస్రో తెలిపింది.

కాగా, రెండు వారాల తర్వాత తిరిగి పగటి సమయం మొదలయ్యాక చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మరోసారి విక్రమ్‌ ఆచూకీ కోసం అన్వేషిస్తుంది. అక్టోబరు 14న నాసా ఎల్‌ఆర్‌వో కూడా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించనుంది. మరోవైపు, ఆర్బిటర్‌లోని 8 సైన్స్‌ పరికరాలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇస్రో వెల్లడించింది. వాటి నుంచి డేటా, చిత్రాలు అందనున్నాయని వివరించింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ బయటకు వచ్చి అక్కడ వాతావరణ పరిస్థితులపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించేలా రూపొందించారు. దీని జీవిత కాలం ఒక్క లూనార్ రోజు (చంద్రుడిపై ఒక్క రోజు భూమిపైన 14 రోజులతో సమానం).

దక్షిణ ధ్రువం ఎల్లప్పుడూ ఛాయా ప్రదేశంలోనే ఉంటుంది. ఇక్కడ సూర్యకిరణాలు ఎక్కువగా ప్రసరించకపోవడంతో చీకటిగానే ఉంటుంది. అందుకే సూర్యోదయం అయ్యే సమయానికి విక్రమ్ ల్యాండింగ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. చంద్రుడిపై విక్రమ్ దిగిన నాలుగు గంటల తర్వాత అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వస్తుందని అంచనా వేశారు. సోలార్ ప్యానల్స్ సాయంతో అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్ని దశలాలను చంద్రయాన్-2 విజయవంతంగా పూర్తిచేసినా, చివరి మెట్టుపై ఆగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here