పేరుకే ఉద్యోగ సంఘ నేత. టిడిపి కి మద్దతు దారుడిగా ముద్ర. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటు వేయమని ప్రచారం. టిడిపి నేతలనే మించిపోయేలా వ్యవహరిస్తున్న ఏపి ఎన్టీవో సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు ప్రవాసాంధ్రుల ఆగ్రహాని కి గురయ్యారు. అక్కడి తెలుగు సంఘాళ మధ్య గొడవకు కారణమయ్యారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, తెలుగు దేశం నాయకులు బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కు ల పోరాట వేదిక’ పేరిట అశోక్బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు.
చంద్రబాబు చెప్పినట్లు అశోక్బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదని చెప్పారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. అశోక్బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, బిజెపి నేతలు ఫైర్ అవుతున్నారు. అశోక్ బాబు వ్యవహారం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తాము గవర్నర్ నరసింహన్ కు, ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే, ఏపి అధికార పార్టీ ఈ రకంగా ఉద్యోగ సంఘ నేతలను పొరుగు రాష్ట్ర ఎన్నికల్లో తమ విధానానికి అనుగుణంగా ఉపయోగించుకోవటం పై ఉద్యోగుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అశోక్బాబు కర్నాటక లో తెలుగు వారి మధ్య గొడవలకు కారణమై ఉద్యోగ సంఘాలకు ఉండే విలువను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.