నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా. చేస్తే ఏ నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తారు. ఏ స్థానం నుండి పోటీ చేస్తే సురక్షితంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కోర్ టీంలో దీనిపై కొద్ది రోజులులగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా చేసి, ఆ తరువాత మంత్రి పదవి ఇవ్వటంపై దొడ్డి దారిన లోకేష్ ను మంత్రి గా చేసారనే విమర్శలు ఉన్నాయి. దీంతో, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని లోకేష్ భావిస్తున్నా రు. దీని కోసం పార్టీ అధినేత ఆలోచనలో పడినట్లు సమాచారం. టిడిపి అధినేత రాయలసీమ నుండి కుప్పం నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో, లోకేష్ను కోస్తా జిల్లాల నుండి బరిలోకి దింపాలనే ఆలోచన జరిగింది. కానీ, సురక్షిత స్థానం ఏదనే దాని పై ఇంకా స్పష్టతకు రాలేదు. కృష్ణా జిల్లా పెనమలూరు పై తొలుత దృష్టి పెట్టినట్లు ప్రచారం జరిగింది.
అయితే, ఇప్పుడు టిడిపి కి అండగా నిలిచే సామాజిక వర్గాలు తన తండ్రి సొంతూరు అయిన నారా వారి పల్లె గ్రామం ఉండే చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, అక్కడ నుండి ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ భాస్కర రెడ్డికి అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ఇక, నగరి నియోకవర్గం పైనా లోకేష్ కోసం ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. కానీ, అక్కడ వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ లోకేష్ పోటీచేస్తూ ఫలితం ఎలా ఉంటుందనే దాని పై టిడిపి కోర్టీంలో స్పష్టత లేదు. దీంతో, ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రగిరి బెస్ట్ అని వారు భావిస్తున్నారు. వీటితో పాటుగా హిందూపూర్ పైనా ఆలోచన జరుగుతోంది. అయితే, అక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా స్థానిక పరిస్థితులు మాత్రం టిడిపికి అంత అనుకూలంగా కనిపించటం లేదు.
టిడిపికి కంచుకోటగా ఉన్న హిందూపూర్ లోనే పరిస్థితి ఇలా ఉండటం తో ఈసారికి ఎమ్మెల్సీగానే ఉంటూ, ఎన్నికల నిర్వహణా బాధ్యత తీసుకొంటే బెటర్ అనే సూచన కూడా పార్టీ నేతల నుండి వస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏదైనా నియోజకవర్గం నుండి అప్పుడు, పోటీ చేయించవచ్చని వారు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపి లో మంత్రిగా ఉన్న లోకేష్ పోటీ చేసే స్థానం పై ఇంత తర్జన భర్జన జరుగుతుంటే. ఇక, పార్టీలో ఎమ్మెల్యేల పరిస్థితి గెలుపు పై టిడిపి లో ఎటువంటి పరిస్థితి ఉందో అర్దమవుతోంది. ఈ పరిస్థితుల కారణంగానే టిడిపి నుండి జంపింగ్లు క్రమేణా పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.