ఆ ఇద్దరిలో ఒకరే టిడిపిలో . మరొకరు ఏ పార్టీలోకి. ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో అదే హాట్ టాపిక్. ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావు. మరొకరు ఎంపి అవంతి శ్రీనివాసరావు. ఇద్దరిది ప్రజారాజ్యం నుండి ఒకటే మాట..ఇకటే బాట. కానీ, కొంత కాలంగా ఇద్దరి మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకటే నియోజకవర్గం కోరుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఎంపి అవంతి ఆలోచన. అయితే, ఎటువంటి పరిస్థితుల్లోనూ భీమిలిని వీడేది లేదని గంటా స్పష్టం చేస్తున్నారు.
విశాఖ కు ప్రత్యేక రైల్వే జెన్ కోసం అవంతి ఇప్పటికే దీక్షలు సైతం చేస్తున్నారు. గంటా వ్యతిరేక వర్గం తోనూ అవంతి సఖ్యతగా ఉంటున్నారు. మంత్రులు గంటా వర్సెస్ అయ్యన్నపాత్రుడు అన్నట్లుగా జిల్లా రాజకీయాలు ఎప్పటి నుండో టర్న్ తీసుకున్నాయి. విశాఖ భూ కుంభకోణంలోనూ ఇద్దరూ ఆరోపణలు చేసుకున్నారు. ఇక, రాజకీయాల్లో సీజన్ ను అనుకూలంగా వ్యవహరించే ఈ నేతలు ఇప్పుడు ఒకటే నియోజకవర్గం కోసం అప్పుడే లాబీయింగ్ ప్రారంభించారు. తనకు భీమిలి కేటాయించకపోతే పార్టీ వీడటానికి సైతం వెనుకాడనని అవంతి ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం అందించారు. తాజాగా నిర్వహించన ఒక సర్వేలో సైతం భీమిలో గంటాకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని తేలటంతో..అవంతి మరింత వేగంగా పావులు కదుపుతున్నారు. గంటాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు జిల్లాలోని మరో టిడిపి ముఖ్య నేత వర్గం అవంతికి అండగా నిలుస్తోంది.
ఇక, గంటా టిడిపి లో జరుగు తున్న పరిణామాల పై అధినేత వద్ద చర్చించాలని డిసైడ్ అయ్యారు. తనకు తగిన హామీ లభించకపోతే రాజకీయంగా కీలక నిర్ణయం గంటా తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో..వీరిద్దిరలో ఒకరే టిడిపిలో ఉండటం …మరొకరు వైసిపిలోకి వచ్చేదెవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజుల క్రితం వైసిపి నేత విజయ సాయి రెడ్డి సైతం విశాఖలో త్వరలోనే టిడిపి నుండి కీలక నేతల చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించటం తో వైసిపి లో కొత్త చేరికల పై చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే నెలలో జగన్ పాదయాత్ర విశాఖ చేరిన తరువాత పరిణామాలు మరింత వేగంగా మారుతాయని..ఊహించని చేరికలకు పాదయాత్ర వేదిక అవుతుందని వైసిపి నేతలు చెబుతున్నారు.