దేశం నివ్వెరపోయే స్కామ్ ఏపీలో జరిగిందా?. అది బయటపడితే రాజకీయ నాయకులంటేనే ఇప్పుడున్న ఏవగింపు కాస్తా తారాస్థాయికి చేరి ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం పోతుందా? అంటే ఏపీ ప్రజల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. దోపు కోవడానికి గోచీ గుడ్డ కూడా లేదు కానీ మీసాలకు సంపెంగనూనె కావాలన్నాడట. అలా అందిన కాడికి ఏది దొరికితే అది ఎంత దొరికితే అంతా గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు దోచేసారని తెలుస్తోంది. రాజధాని పేరుతో ఏపీ ప్రజలని అడ్డంగా ముంచేశారు. నిత్యం దొంగతనాలు చేసేవాడైనా ట్రై చేయాలా వద్దా? అని ఒకింత భయపడతాడు కానీ వేల కోట్ల ప్రజా ధనాన్ని టీడీపీ నేతలు ఎలాంటి బెరుకు లేకుండా బాబు సొమ్ములా యధేచ్ఛగా వాడుకుని ఆస్తులు పెంచుకున్నారంటే వ్యవస్థ ఎటు పోతోంది? అన్న సందేహం కలగక మానదు.
పట్టెడన్నం కోసం దొంగతనం చేసేవాడు కూడా దొరికిపోతే కడుపుకు తిండి దొరకదనే భయంతో వ్యవహరిస్తాడు. కానీ వేల కోట్లు కొల్లగొట్టిన నేటి రాజకీయ నేతలకు, దారి దోపిడీ చేసే బందిపోటు దొంగలకు తేడా ఏమీ కనిపించడం లేదు. రాజకీయ నాయకుల ముసుగులో వున్న కొంత మంది డెకాయిట్లు సేవ పేరుతో దేశాన్ని, దేశ ఆర్ధిక మూలాల్ని అంతం చేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఏపీ రాజధాని పేరుతో ఆడిన రాక్షస క్రీడ వెనుక దాగి ఉన్న అసలు నిజాలు బయటికి వస్తే దేశం నివ్వెర పోవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజధాని ముసుగులో టీడీపీ పాలకవర్గం ఆడిన ఆట నేటి రాజకీయ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో ఎంత ప్రమాదకరంగా మారిందో దేశానికి చాటి చెప్పబోతోంది. వేల కోట్ల స్కామ్ని అధికార దర్పంతో చేసిన నేటి రాజకీయ నాయకుల్లో కించిత్ బాధ, భయం కనిపించకపోవడం సిగ్గు చేటని, ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టని రాజకీయ విశ్లేషకులు ఏపీ రాజకీయాలపై ఆగ్రహ జ్వాలలు వెల్లగక్కుతున్నారు.