వైసిపి లోకి భక్తవత్సల నాయుడు. గతంలో టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఎన్టీఆర్ ను అన్నగారు అంటూ ఆప్యాయంగా పిలిచే డైలాగ్ కింగ్ మోహన్ బాబు పొలిటికల్ రీఎంట్రీ వైసిపి ద్వారానే జరగనుంది. గతంలో టిడిపి లో పని చేసిన మోహన్ బాబు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలు శ్రీ విద్యానికేతన్ నిర్వహణ సామాజిక కార్యక్రమాల్లో మునిగిపోయారు. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోహన్బాబు వైయస్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి.
వైయస్ పాలనను అనేక సందర్భాల్లో మోహన్బాబు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు తోనూ మోహన్బాబు మంచి సంబంధాలే నడిపారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతం తరువాత చంద్రబాబు తో మోహన్ బాబు దూరం పాటిస్తూ వచ్చారు. మోహన్బాబు తనయుడు విష్ణు వివాహ వైయప్ బంధువుల కుమార్తె తో జరిగింది. అప్పటి నుండి జగన్, మోహన్బాబు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పలు మార్లు జగన్ ను సైతం మోహన్ బాబు కలిసారు. పలుమార్లు అభినందనలు తెలిపారు. ఇక, ప్రస్తుతం మోహన్బాబు రాజకీయంగా రీఎంట్రీ చేయాలని భావిస్తున్నారని, అందునా వైసిపి నుండే తన రీఎంట్రీ ఉండాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీని, కోసం ఎంపీగా రాయలసీమ నుండి పోటీ చేయాలనేది మోహన్బాబు కోరికగా తెలుస్తోంది. కానీ, చిత్తూరు, తిరుపలి రెండు స్థానాలు రిజర్వ్ డ్ కావటం రాజంపేట నుండి మిధున్రెడ్డిని కాదనే పరిస్థితి లేకపోవటంతో లోక్సభ ఇవ్వలేమని వైసిపి నేతలు చెబుతున్నట్లు సమాచారం. దీని, కోసం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి లో మోహన్బాబుకు విస్తృత పరిచయాలు ఉండటం తో అక్కడి నుండి పోటీ చేయించే ప్రతిపాదన పై వైసిపి అధినేత ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ, మోహన్బాబు తనకు లోక్సభ లేదా రాజ్యసభ అవకాశం ఇస్తే తాను పార్టీ కోసం పని చేయటానికి సిద్దంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. మోహన్ బాబు వైసిపి లోకి వస్తే సినీ గ్లామర్ తో పాటుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పార్టీకి మరింత బలం పెరుగుతుందని వైసిపి అంచనా వేస్తోంది. ఇక, ఇచ్చే స్థానం పోటీ చేసే అంశం పై క్లారిటీ వస్తే మోహన్ బాబు పొలిటికల్ రీఎంట్రీ వైసిపి నుండి ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.