కర్నాటకలో బిజెపి గెలిస్తే టిడిపి కి నష్టమేంటి. కర్నాటకలో గెలిచేదెవరు. ప్రస్తుతం కర్నాటకలో జరుగుతున్న పోలింగ్ పైఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల పోలింగ్ ముందు రోజు టిడిపికి అనుకూలంగా మాట్లాడి విశాఖలో వైసిపికి నష్టం చేసిన సబ్బంహరి ఇప్పుడు, కర్నాటక ఎన్నికలపై జోస్యం చెప్పారు. కర్నాటకలో బిజెపి వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేల్చి చెప్పారు. అదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో బీజేపి గెలిచిన తరువాత ఏపి లో రాజకీయాల్లో మార్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు. గుజరాత్లో బిజెపి విజయం తరువాత ఏపీలో చాలా మార్పులు జరిగాయని గుర్తు చేసారు. ఏపిలో ప్రస్తుతానికి టిడిపి బలంగా ఉందని, ఆపార్టీ పై తన విశ్వాసాన్ని చాటుకుంటూనే ఎన్నికల్లోపు ఏమైనా జరగొచ్చని టిడిపికి జరిగే నష్టంపై పరోక్షంగా అంచనాకు వచ్చారు.
వచ్చే, ఎన్నికల వరకు చంద్రబాబు చాలా కష్టపడాల్సి వస్తుందని కుండ బద్దలు కొట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ఏదైనా చేయచ్చని సబ్బంహరి అంచనా వేస్తున్నారు. గతంలో వైసిపిలో ఉంటూ, పార్టీకి ద్రోహం చేసిన సబ్బంహరి గత ఎన్నికల్లో విశాఖలో వైయస్ విజయమ్మను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసారు. పోలింగ్ ముందు రోజు టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. అప్పటి నుండి టిడిపి లో అధికారికంగా చేరనప్పటికీ ఆ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సబ్బంహరి టిడిపిలో అధికారికంగా టిడిపిలో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇక, కర్నాటక ఎన్నికల్లో బిజెపి గెలవకుండా చూసేందుకు టిడిపి, మద్దతు దారులు అనేక ప్రయత్నాలు చేసారు. అయితే, కొద్ది రోజులక క్రితం టిడిపి మద్దతు మీడియా సైతం కర్నాటకలో బిజెపికే అవకాశం అంటూ కధనాలు ఇచ్చింది.
ఇప్పుడు సబ్బంహరి లాంటి వారు సైతం బిజెపికే గెలుపు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కర్నాటకలో బిజెపి గెలిస్తే ఆ తరువాత ఏపి పై బిజెపి అధినేతలు దృష్టి సారిస్తారని, ఇబ్బందులు తప్పవని టిడిపి విస్తృత స్థాయి సమావేశంలోనూ చర్చ జరిగింది. పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కర్నాటకలో బిజెపి అనుకూల పరిస్థితులు ఉన్నాయని టిడిపికి అండగా నిలిచే సబ్బం హరి లాంటి వారు చెబుతుంటే..టిడిపి నేతల్లో కలవరం మొదలైంది. అదే సమయంలో చంద్రబాబు కష్టపడాల్సి వస్తుంని చెప్పటం కూడా టిడిపి నేతలకు మింగుడు పడటటం లేదు. ఇప్పుడు సబ్బంహరి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరి, కర్నాటకలో వాస్తవం ఏంటో తేలాలంటే.15వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఆ తరువాత ఇక ఏపిలో రాజకీయంగా పరిణామాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.