ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పేదలకు అన్ని రోగాలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స చేయించుకోవచ్చని, ఏ వ్యాధికైనా రూపాయి కట్టకుండా నివారణ చర్యలుచేపడతానని చెప్పిన హామీని నెరవేర్చుందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శాఖల వారీగా సమీక్షలు చేస్తున్న సీఎం జగన్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారలతో ముచ్చటించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సహా, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పేదలపై వైద్య చికిత్సల భారం లేకుండా చూస్తామని, ఎటువంటి వ్యాధి అయినా ఉచితంగా వైద్యాన్ని అందించేలా చూడాలని, పాదయాత్రలో ప్రజలకు తానిచ్చిన హామీని అమలుపరిచే పనులు చెపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మంది సిబ్భంది లేకపోవడంతో రోగులకు వైద్యం సరిగ్గా అందటంలేదని, త్వరలో ప్రభుత్వాసుపత్రిల్లో అన్ని విభాగాలకు సరిపడిన సిబ్భందిని నియమిస్తామని చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని అధికారులకు సీఎం ఆదేశించనున్నారు. ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించనున్నారు.ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి, మంచి ఫలితాలను సాధించాలన్నదే తన లక్ష్యమని అధికారులకు సూచించిన ఆయన, అందరికీ వైద్య సదుపాయాలను దగ్గర చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలపై నివేదికలు తయారు చేస్తున్న అధికారులు, వాటిని సీఎంకు త్వరలోనే అందించనున్నారు.